ఒకప్పుడు రెండు ఎంపీ సీట్లతో ప్రయాణం మొదలుపెట్టిన భారతీయ జనతా పార్టీ.. తన పటిష్ట సిద్ధాంతాలతో రెండు సార్లు వరుసగా అధికారంలోకి రావడమే కాదు మూడో సారి పగ్గాలు చేపట్టేందుకు రెడీగా ఉంది. మోదీ సమర్థ పాలనతో బీజేపీ ఒక ప్రబల శక్తిగా మారగా.. ప్రతిపక్ష కాంగ్రెస్, తదితర పార్టీల గ్రాఫ్ రోజురోజుకూ మరింత దిగజారి పోతోంది. దేశ మేలు కోసం కఠిన నిర్ణయాలు ఎన్నింటినో తీసుకుంటూ బీజేపీ విజయవంతంగా దూసుకెళ్తుండగా, సదరు ప్రతిపక్ష పార్టీలు ప్రజల మేలు ఓర్వలేకపోతున్నాయి. నానాటికీ ప్రజల మద్దతు కరువై విలవిలలాడుతున్నాయి. ఇక మూడో సారి మోదీ వస్తే.. తమకు నూకలు చెల్లినట్టేనని నరేంద్రుడి ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతూ.. అభివృద్ధిని అడ్డుకునేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఎందుకింత అక్కసు..
బీజేపీలో వారసత్వ రాజకీయాలు ఉండవు అనేది అందరికీ తెలిసిందే. సామాన్యుడు కూడా ప్రధాని కావొచ్చు.. పార్టీ అధ్యక్షుడు కావొచ్చు అని నిరూపించిన పార్టీ అదొక్కటే. దేశంలోని మిగతా ఏ పార్టీలకు కూడా సాధ్యం కాని, రుచించని విషయమది. సామాన్య బీసీ కుటుంబానికి చెందిన నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక.. ధనస్వామ్య, కుటుంబ వారసత్వ పార్టీలకు కంటగింపుగా మారింది. గుజరాత్ రాష్ట్రాన్ని ప్రగతిపథాన నిలిపిన అనుభవంతో దేశాన్ని చక్కదిద్దేపనిలో విజయవంతమవుతున్న మోదీ పాలనను హర్షించాలంటే వారికి మనసొప్పడం లేదు. దేశంలోని మెజార్టీ రాజకీయ పార్టీలు కుటుంబ వారసత్వ, రాచరిక, కుహానా లౌకిక పార్టీలే. కాంగ్రెస్ నుంచి మొదలు బీఆర్ఎస్, టీడీపీ దాక అంతే. తమ వారసత్వాన్ని నిలుపుకునేలా తమ కొడుకుకో, బిడ్డకో పార్టీ పగ్గాలు అందిస్తుంటాయి. ప్రజలు తమ బానిసలు అన్నట్టుగా వ్యవహరిస్తుంటాయి. ప్రతీ ఒక్కరూ ప్రజాప్రతినిధి కావొచ్చు అనే ప్రజాస్వామ్య భావనను తుంగలో తొక్కుతున్నాయి. ప్రజల క్షేమం పట్టక.. సంక్షేమ పథకాల పేరిట ప్రజల సొమ్మును వారికి పావలా పంచి.. స్కాంల పేరిట కోట్లలో బొక్కుతున్నాయి. ఇలాంటి విషయాలకు ఇంచు కూడా జాగాలేని బీజేపీని అప్రతిష్ట పాలు చేసేందుకు నిత్యం అవి పనిచేస్తుంటాయి.
ఆదరణను అడ్డుకోలేక..
బీజేపీ దేశవ్యాప్త ఆదరణ, ప్రపంచ వ్యాప్త గుర్తింపు, ప్రపంచ నాయకుడిగా నరేంద్ర మోదీ చరిష్మాను అడ్డుకోవడానికి కాంగ్రెస్, కమ్యూనిస్టులు, తదితర లోకల్ పార్టీస్ అన్ని కలిపి ‘ఇండియా’ గా కొత్త అవతారమెత్తాయి. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు, కుటుంబ వారసత్వాన్ని నిలుపుకునేందుకు ఆడరాని అబద్ధాలు ఆడుతున్నాయి. అందుకే వీటిని ప్రధాని మోదీ ‘ఘమండియా’గా అభివర్ణిస్తుంటారు. అంటే అహంభావుల కూటమి అని ఆయన ఎద్దేవా చేయడం వందపాళ్లు సమర్థనీయమే. దేశ క్షేమం పట్టని పార్టీలు, స్వలాభం కోసం ఆరాట పడడాన్ని దేశ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అందుకే వారిని రెండు సార్లు పాతాళానికి పరిమితం చేశారు. మరోసారి కఠిన శిక్ష వేయడానికి జనం సిద్ధమై ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు ఉన్నా పార్టీగా, సగటు భారతీయుడు గర్వించే పనులు మాత్రమే చేసే పార్టీగా కీర్తిశిఖరాలు అందుకున్న బీజేపీని ప్రజాక్షేత్రంలో వెనక్కి లాగడం ఆ పార్టీల వాళ్ల కాకపోవడంతో.. కుటిల ప్రయత్నాలు చేస్తుంటాయి. వాటన్నింటిని తొక్కుకుంటూ దేశాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తూ మరోసారి ‘కమల వికాసాని’కై ప్రధాని మోదీ అహర్నిషలు కష్టపడుతున్నారు.




