‘ఆగస్టు 5వ తేదీన తీసుకున్న నిర్ణయం ఉపసంహరించడానికి వీలు కానిది.జమ్ము, కశ్మీర్, లద్దాఖ్ ను కొత్త మార్గంలో నిలపాలన్న సంకల్పం చెక్కు చెదరనిది. ఆగస్టు 5వ తేదీన భారతదేశానికి చెందిన మొత్తం రాజ్యాంగం, చట్టం జమ్మూ కశ్మీర్ లో అమల్లోకి వచ్చాయి. జమ్మూ, కశ్మీర్, లద్దాఖ్ అభివృద్ధికి 70 సంవత్సరాలుగా ఉన్న పెద్ద అవరోధం తొలగిపోయింది.’’
-ప్రధాని నరేంద్ర మోదీ
గతంలో చేతిలో రాళ్లు పట్టుకున్న యువత.. నేడు ల్యాప్ టాప్ లు పట్టుకుంటున్నారు. అప్పట్లో తుపాకుల మోత వినపడేది.. ఇప్పుడు పక్షుల కిలకిలరావాలు శ్రావ్యంగా వినిపడుతున్నాయి. ఒకప్పుడు పాలకులు అక్కడికి వెళ్లాలంటే వందలాది కమెండోల గన్నుల నీడన వెళ్లేవారు.. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు కూడా స్వేచ్ఛగా, ఆనందంగా వేకేషన్ కు వెళ్తున్నారు. అప్పటికీ, ఇప్పటికీ ఎంత తేడా!. గత పాలకులు అధికారం కోసం కాశ్మీరాన్ని శవాల దిబ్బగా మార్చారు.. నేటి పాలకుడు పర్యాటక స్వర్గధామంగా మలిచారు. జమ్మూ కశ్మీర్, లద్దాక్ ఇంతలా మారిపోవడానికి ఐకైక కారణం 370 ఆర్టికల్ రద్దు. ఈ ఘనత దాన్ని అమలు చేసిన మోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వానిది. ఎన్ని అడ్డంకులు వచ్చినా తాము అనుకున్నది చేసి.. నేడు కశ్మీర్ ను ప్రపంచ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దారు.
నాలుగు సంవత్సరాల కింద 2019 ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకుంది. దూరదృష్టితో ఆలోచించి చారిత్రక తప్పిదాలను సరిదిద్దే చర్యలు చేపట్టడంతో ఆ ప్రాంతంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పుడు అక్కడి యువత విద్యావంతులై జమ్మూ కశ్మీర్ నే కాదు..దేశ భవిష్యత్ ను తీర్చిదిద్దేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇటీవల జి-20 శిఖరాగ్ర సమావేశం కూడా జరిగింది. పలువురు ప్రపంచ నాయకులు అక్కడ పర్యటించారు. అక్కడి అద్భుత అందాలను చూసి పరవశించిపోయారు. కశ్మీర్ లో పరిస్థితులూ ఎంతో బాగున్నాయని కితాబు కూడా ఇచ్చారు.
ఆయన వల్లే..
జమ్మూ కశ్మీర్ ను భారత్ లో తిరిగి ఐక్యం చేసుకోవడం, 370వ అధికరణం రద్దుకు శ్యామ ప్రసాద్ ముఖర్జీ త్యాగం, సాహసం, దీక్ష కీలకం. 370వ అధికరణం అమలు పరచాలన్న ప్రతిపాదనకు నిరసనగా దేశాన్ని రెండు చట్టాలు, రెండు జెండాలు, ఇద్దరు అధిపతులు పరిపాలించడం సాధ్యం కాదని వాదిస్తూ 1953 సంవత్సరంలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ భారత పారిశ్రామిక మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2019 ఆగస్టు 5వ తేదీన ప్రధాని మోదీ సారథ్యంలోని ప్రభుత్వం 370వ అధికరణం చెల్లకుండా చూసింది. తద్వారా ముఖర్జీ కలను మోదీ సాకారం చేశారు.
370 రద్దుతో నవోదయం..
జమ్మూ కశ్మీర్ ను గురించి ఏనాడూ కాంగ్రెస్ పార్టీ ఆలోచించలేదు. రాజకీయమే తప్పా ప్రజల మేలు వారికి పట్టలేదు. కానీ నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేయాలనుకున్న పనుల ప్రాధాన్యాల్లో 370వ ఆర్టికల్ రద్దుకు అగ్రస్థానం. ఏక్ భారత్-శ్రేష్ట భారత్ నినాదంతో ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో అక్కడ నవోదయం వెల్లివిరుస్తోంది. కొత్త చలన చిత్ర విధానం, హోమ్ స్టే విధానం, హౌస్ బోట్ విధానం కారణంగా పెట్టుబడులు పెరుగుతున్నాయి. పర్యాటకానికి మళ్లీ మంచి రోజులు వచ్చి కశ్మీరీల బతుకుల్లో వెలుగులు ప్రసరిస్తున్నాయి. 370 రద్దుపై నానా యాగీ చేసిన కాంగ్రెస్ తదితర పార్టీలు ప్రస్తుతం అక్కడి అభివృద్ధిని చూసి నోటమాటరావడం లేదు.





