21వ శతాబ్దపు ఆకాంక్షిత లక్ష్యాలకు అనుగుణంగా ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక నిర్ణయం.. నూతన జాతీయ విద్యా విధానం-2020. ఉపాధ్యాయ కేంద్రీకృత విధానం నుంచి విద్యార్థులపై పూర్తిగా దృష్టి కేంద్రీకృతం చేసే విధంగా సంస్కరణలు చేపట్టారు. దీని వల్ల విద్యార్థుల సృజనాత్మకత శక్తిని వెలికితీయడంలో, వారి సంపూర్ణ వికాసానికి తోడ్పాటు లభిస్తుంది. నూతన విద్యా విధానం అమలు ద్వారా భారత్ సూపర్ పవర్ గా మారుతుందని ప్రధాని మోదీ విశ్వసిస్తున్నారు. గతంలో బ్రిటీష్ వారి విద్యా విధానాన్ని అనుసరించిన భారత్.. విద్యార్థులకు మార్కుల పోటీలో నిలిపింది. చదివిన చదువు ఒకటైతే.. చేసే కొలువు మరొకటిగా ఉండేది. చదివిన చదువుకు సార్థకత ఉండేది కాదు. బట్టీ చదువులు నైపుణ్యాన్ని నేర్పలేదు. దీంతో భారత విద్యార్థులు స్కిల్ లెస్ గా ఉండిపోయి.. ప్రపంచ పోటీని తట్టుకోలేకపోయారు. ఇవన్నీ గమనించిన మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం విద్యా రంగంలో పెనుమార్పులు తీసుకురావాలని భావించింది. అందుకే నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చింది.
అమలు ఇలా..
జాతీయ విద్యా విధానం మాతృభాష లేదా స్థానిక భాషను బోధనా మాధ్యమంగా ఉపయోగిస్తారు. త్రిభాషా సూత్రం పాటిస్తారు.విద్యార్థులు మూడు భాషలను నేర్చుకోవాలి. మూడు భాషల్లో కనీసం రెండు భారతీయ భాషలై ఉండాలి. గతంలోని 10+2 స్థానంలో 5+3+3+4 అమలు చేస్తారు. 3 సంవత్సరాల నుంచి ప్రీస్కూల్ లేదా అంగన్ వాడీ, తర్వాత ప్రాథమిక పాఠశాలలో 1,2 తరగతులు. ఇది 3-8సంవత్సరాల వయస్సు పిల్లలకు వర్తిస్తుంది. 3నుంచి 5తరగతులు..ఇది 8-10సంవత్సరాల వయస్సు వరకు ఉంటుంది. 6నుంచి 8తరగతులు.. 11నుంచి13 సంవత్సరాల వయస్సు పిల్లలకు వర్తిస్తుంది. 9 నుంచి 12 తరగతులు.. 14-18 సంవత్సరాల వయస్సు విద్యార్థులకు వర్తిస్తుంది. ఉన్నత విద్యలో 4 సంవత్సరాల మల్టీ డిసిప్లినరీ బ్యాచిలర్ డిగ్రీని ప్రతిపాదించింది. ఇవి వృత్తిపరమైన రంగాలను కలిగి ఉంటాయి.
ప్రయోజనాలు ఇలా..
-ఈ విద్యా విధానం వల్ల పరిశీలనాత్మక ఆలోచనా ధోరణి, సమస్యలను పరిష్కరించగలిగే శక్తిసామర్థ్యాలు పెంపొందుతాయి.
-‘సాఫ్ట్ స్కిల్స్’ అయిన.. నాయకత్వ లక్షణాలు, టీం వర్క్, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు, సాహసోపేత నిర్ణయాలు తీసుకునే ఆలోచనా విధానం అలవడుతాయి.
-విద్యార్థులపై అనవసర పాఠ్యాంశాల భారం తొలుగుతుంది. విద్యార్థులకు ఇష్టమైన సబ్జెక్టును చదువుకునే ఏర్పాటు.. సొంత అధ్యయనానికి పెద్దపీట వేయడం వల్ల కోచింగ్ కేంద్రాల సంస్కృతిని నిర్వీర్యం చేయవచ్చు.
– దేశ ప్రజలందరికీ సమాన, సమ్మిళిత, నాణ్యమైన విద్య అందిస్తారు. తద్వార సాంఘిక పరమైన అసమానతలు తొలగిపోతాయి. సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చేయూత లభిస్తుంది.
-నూతన జాతీయ విద్యావిధానంలో ప్రపంచ స్థాయి విద్యను అందించడం వల్ల విద్యార్థులకు ప్రపంచంలో నలుమూలల ఎక్కడికి వెళ్లినా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుంటారు.
అంతా మోదీ చలవే..
చిన్నారుల వీపులపై బండెడు పుస్తకాల మోతను వ్యతిరేకించే ప్రధాని మోదీ.. వారిలో నైపుణ్యాభివృద్ధికి తోడ్పాడే విద్యావిధానాన్ని తీసుకొచ్చారు. ఎంతో మంది తలపండిన విద్యా నిపుణుల చేత భారతీయ పరిస్థితులకనుగుణంగా తయారు చేసిన గొప్ప విద్యా విధానమిది. దీని అమలు ద్వారా రాబోయే రోజుల్లో కోట్లాది మంది నైపుణ్యమున్న విద్యార్థులను తయారుచేయనుంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా డివిడెండ్ ఉన్న భారత్.. 2047నాటికి ప్రపంచ నంబర్ వన్ గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రపంచంలో విలువైన యువత ఎక్కడైనా ఉందా అంటే.. అది భారత్ మాత్రమేనని చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.





